ఓ వ్యక్తి కస్టమర్‌లాగా ఓదుకాణంలోకి వచ్చాడు. అక్కడ ఓ మహిళ ఉంది. ఆమెను ఏదో వస్తువుగురించి వివరాలు అడిగాడు..

ఇంతలో ఫోన్‌ వచ్చినట్టు తెగ ఫోన్‌ మాట్లాడేస్తూ ఉన్నాడు. కస్టమర్‌ ఫోన్‌ మాట్లాడుతున్నాడు కదా అని మహిళ ఎదురు చూస్తూ ఉంది. అతను ఫోన్‌ మాట్లాడ్డం ఆపకపోగా ఆమె వెనుకకు తిరగగానే..

మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. విషయం తెలిసిన స్థానికులు వెంటపడి చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రామంతాపూర్‌కు చెందిన కాసుల సంధ్య హనుమాన్‌సాయినగర్‌లోని ఒక కాస్మొటిక్ షాపులో పని చేస్తోంది.

గురువారం మధ్యాహ్నం ఓ యువకుడు ఫేస్‌వాష్ కొనే నెపంతో దుకాణంలోకి వచ్చాడు. సంధ్య అతడికి వస్తువును చూపించేందుకు వెనక్కి తిరిగిన క్షణంలో.. ఆమె మెడలోని 37 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు.

బాధితురాలు గట్టిగా కేకలు వేస్తూ నిందితుడి వెంట పడటంతో, దుకాణంలో ఉన్న మరో కస్టమర్, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడిని ఉప్పల్ మండే మార్కెట్ ప్రాంతంలో చుట్టుముట్టి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన బానోతు శ్రీనివాస్ గా గుర్తించారు. ప్రస్తుతం ఇతడు ఎస్.ఆర్.నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ చోరీ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

శ్రీనివాస్ వద్ద నుండి మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించిన స్థానికులను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.