స్నేహితులను సరదాగా భయపెట్టాలని చేసిన ఓ ప్రయత్నం.. ఒక యువ వ్యాపారవేత్త ప్రాణాలనే బలితీసుకుంది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఖాద్రీహిల్స్‌కు చెందిన నవాబ్‌ సయ్యద్‌ ఖుమైజ్‌ మొహిద్దీన్‌ హుస్సైనీ కి మొయినాబాద్‌లో ఓ ఫాంహౌస్‌ ఉంది.

జూన్‌ 17న రాత్రి ఆయన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫాంహౌస్‌లోకి ఒక చిన్న కట్లపాము వచ్చింది. మొహిద్దీన్‌ దాన్ని చేతితో పట్టుకొని స్నేహితులను సరదాగా భయపెట్టడం ప్రారంభించారు.

ఈ క్రమంలో ఆ పాము ఆయన కుడిచేతి బొటనవేలును గట్టిగా పట్టుకుంది. పాము కరుస్తోందని అంటూనే దాన్ని మరో చేతితో వదిలించుకున్నారు. స్నేహితులు ఆందోళన చెందినా..

తనకు ఏమీ కాదని మొహిద్దీన్ వారిని వారించారు. అయితే, గంట తర్వాత శరీరంలో మార్పులు రావడంతో మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కానీ, అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే మొహిద్దీన్‌ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాము కాటేసినప్పుడు ఎలాంటి మూఢనమ్మకాలను నమ్మకుండా, సమయం వృథా చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

మీరు ప్రాణాలతో ఆడుకునే చిన్న సరదా.. మీ కుటుంబానికి కోలుకోలేని శోకాన్ని మిగులుస్తుందని గుర్తుంచుకోండి.