ఫిన్‌గ్రోత్‌ మీడియా వ్యవస్థాపకుడు కనన్‌ బహల్‌ ఏడేళ్ల క్రితం దుబాయ్‌లో వచ్చిన రూ.36 లక్షల వార్షిక జీతంతో కూడిన ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించారు. చార్టర్డ్ అకౌంటెంట్ల కోసం నిర్వహించే ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఆఫర్ అని ఆయన ఎక్స్‌ వేదికగా తెలిపారు.

ఆ ఉద్యోగం తీసుకుంటే ఖర్చులు పోను ఏడాదికి రూ.20 లక్షలు ఆదా చేసే అవకాశం ఉండేదని బహల్‌ పేర్కొన్నారు. అప్పట్లో భారత్‌లో తనకు లభించిన ఉద్యోగాల్లో ఏడాదికి రూ.12 లక్షలకు మించి జీతం ఇచ్చేవి లేవని ఆయన వివరించారు. జీతంలో ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, తన కుటుంబానికి, సంస్కృతికి దగ్గరగా ఉండటానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.

ఏడేళ్లు గడిచినా తన నిర్ణయం పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో తాను నిర్మించుకున్న కెరీర్ దుబాయ్ ఉద్యోగం కంటే ఎంతో లాభదాయకంగా మారిందని ఆయన తెలిపారు. భారత్‌ పరిపూర్ణంగా లేకపోయినా, మనమే దాన్ని మెరుగుపరచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తన పూర్వీకులు 1947లో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, భారత్ వారికి ఆశ్రయం ఇచ్చిందని బహల్ పేర్కొన్నారు. ఈ పోస్టుకు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఆయన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తూ, దేశంపై ఆయనకున్న నమ్మకాన్ని అభినందించారు.