తెలంగాణ వాసులను మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్ల నెట్వర్క్ను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఛేదించారు. ఢిల్లీలోని శివ మార్కెట్ కేంద్రంగా సాగుతున్న మూడు కాల్ సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బజాజ్ ఫైనాన్స్ సంస్థ పేరును వాడుకుంటూ ఈ ముఠా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ ఆశ చూపి, లోన్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ మరియు బీమా ప్రీమియంల పేరుతో బాధితుల నుంచి ఈ ముఠా భారీగా డబ్బు వసూలు చేస్తోంది. ఈ దాడుల్లో 21 మంది మహిళా టెలికాలర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని అధికారులు గుర్తించారు.
ఈ మోసాలకు ప్రధాన సూత్రధారులుగా ఉన్న లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అరెస్టయిన వారిలో ఒక బ్యాంకు ఖాతాదారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.








