జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. బంగ్లాదేశ్ జట్టుపై 114 పరుగుల భారీ తేడాతో గెలిచి, పసిడి పతకం కోసం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 49 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆమెకు ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం.

షఫాలీతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40 పరుగులు, స్మృతి మంధాన 37 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో సహకరించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సంజీదా అక్తర్ మేఘ్లా ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు, భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 15.4 ఓవర్లలోనే 81 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. ఓపెనర్ దిలారా అక్తర్ చేసిన 27 పరుగులే ఆ జట్టులో అత్యధికం.

భారత బౌలర్లలో దీప్తి శర్మ, నందినీ శర్మ చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు. శ్రీ చరణి 2 వికెట్లు, శ్రేయంక, క్రాంతి తలో వికెట్ సాధించి బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేశారు.

ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరుకుని రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చిన శ్రీలంక జట్టుతో భారత్ బంగారు పతకం కోసం తలపడనుంది.