Sanjeev Bikhchandani: భారతీయ ఇంటర్నెట్ రంగంలో చాలా కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం కోట్ల రూపాయల డబ్బును తగలేస్తున్న సమయంలో.. ‘ఇన్ఫో ఎడ్జ్’ (నౌక్రీ.కామ్ మాతృసంస్థ) అధినేత సంజీవ్ బిఖ్‌చందానీ మాత్రం నిశ్శబ్దంగా భవిష్యత్తు శతాబ్దపు దిగ్గజ కంపెనీలకు పునాది వేస్తున్నారు. 2007 నుంచి ఆయన సుమారు 135 స్టార్టప్‌లలో రూ.4,900 కోట్లు పెట్టుబడి పెట్టగా, వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ.41,300 కోట్లకు చేరింది. అంటే తన పెట్టుబడిపై దాదాపు 8.4 రెట్ల భారీ లాభాలను అర్జించి సరికొత్త రికార్డు సృష్టించారు. మన నిత్య జీవితంలో భాగమైన జొమాటో (Zomato), పాలసీబజార్ (Policybazaar) వంటి అగ్రశ్రేణి కంపెనీల వెనుక ఉన్న సంజీవ్ బిఖ్‌చందానీ సక్సెస్ స్టోరీ, ఆయన బిజినెస్ వ్యూహాలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.

కేవలం లాభాల రేటు (IRR) కోసమే కాకుండా, సమాజంలో ఆదర్శప్రాయంగా నిలిచే స్టార్టప్‌లను గుర్తించడం తన ప్రాథమిక లక్ష్యమని బిఖ్‌చందానీ స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారుల జీవితాలను మార్చేసే కన్స్యూమర్ టెక్నాలజీ విభాగంలోని 45 కంపెనీలలో ఇన్ఫో ఎడ్జ్ రూ.2,755 కోట్లు పెట్టుబడి పెట్టగా, వాటి ప్రస్తుత విలువ రూ.37,214 కోట్లకు చేరింది. జొమాటో విలువ రూ.9.4 కోట్లు, పాలసీబజార్ విలువ రూ.21 కోట్లుగా ఉన్నప్పుడే, భవిష్యత్తులో ఇవి ప్రతి ఇంట్లోనూ అవసరమయ్యే బ్రాండ్లుగా మారుతాయని ఆయన ముందుగానే ఊహించి వీటిలో పెట్టుబడులు పెట్టారు. నేడు ఆ రెండు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో ప్రధాన పాత్రధారులుగా నిలిచాయి.

ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న చాట్‌జీపీటీ వంటి సాంకేతికత అందుబాటులోకి రాకముందే, ఇన్ఫో ఎడ్జ్ 2020లోనే ఏఐ (AI), డీప్‌టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా 54 ఏఐ-నేటివ్, డీప్‌టెక్ కంపెనీలలో రూ.1,003 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. కేవలం ఏఐ రంగంలోని 28 కంపెనీలలో పెట్టిన రూ.614 కోట్ల పెట్టుబడి, ఇప్పుడు రూ.1,268 కోట్లకు చేరింది. ఇందులో 15 స్టార్టప్‌లు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి వరుసగా నిధులను సాధిస్తూ భారతీయ టెక్ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నాయి. ఇన్ఫో ఎడ్జ్ యొక్క డీప్‌టెక్ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం రిస్క్‌తో కూడుకున్నది అయినప్పటికీ, భారత ప్రభుత్వ “ఇండియాఏఐ మిషన్”, ఇతర వినూత్న పథకాల వల్ల వీటికి భారీ ఊతం లభిస్తోంది. ఈ విభాగంలోని 30 కంపెనీలలో పెట్టిన రూ.455 కోట్ల పెట్టుబడి ఇప్పుడు రూ.559 కోట్లకు పెరిగింది. వాయిస్ ఏఐ స్టార్టప్ Gnani.ai ప్రభుత్వం నుంచి రూ.177 కోట్ల కంప్యూట్ క్రెడిట్లను పొందింది. దేశంలోని మొట్టమొదటి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (RDI) పథకం కింద ePlaneకు రూ.285 కోట్లు, Manastu Spaceకు రూ.115 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇదే సమయంలో వేర్‌హౌస్ ఆటోమేషన్ రంగంలోని అన్‌బాక్స్ రోబోటిక్స్ కూడా లాభాల బాట పట్టింది.

ఇన్ఫో ఎడ్జ్ సాధించిన ఈ అసాధారణ విజయానికి దాని ప్రధాన వ్యాపారమైన Naukri.com నుంచి వచ్చే బలమైన, స్థిరమైన నగదు ప్రవాహమే కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర వెంచర్ క్యాపిటలిస్టుల లాగా పదే పదే బయట మార్కెట్ నుంచి నిధులు సేకరించడానికి సమయం వృథా చేయకుండా, కేవలం సరైన స్టార్టప్‌లను గుర్తించడంపైనే తమ బృందం దృష్టి పెట్టడానికి ఈ ఆర్థిక బలం తోడ్పడిందని అంటున్నారు. మొత్తం పెట్టుబడిలో రూ.3,600 కోట్లు ఇన్ఫో ఎడ్జ్ సొంత నిధులు కాగా, రూ.1,300 కోట్లు మాత్రమే బయటి పెట్టుబడిదారుల నుంచి సేకరించారు. భారతదేశం ప్రస్తుతం ఒక అద్భుతమైన దశలోకి ప్రవేశిస్తోందని, రాబోయే రోజుల్లో కేవలం ఇండియా కోసమే కాకుండా యావత్ ప్రపంచం కోసం పనిచేసే అతిపెద్ద గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు మన దేశం నుంచే పుట్టుకొస్తాయని సంజీవ్ బిఖ్‌చందానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.