వామ్మో.. పూణె హత్య కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. హనీమూన్ మర్డర్ కేసు కంటే పూణె కేసు మరింత భయంకరంగా ఉంది. హనీమూన్ మర్డర్ కేసే ఘోరం అనుకుంటే.. ఇది మరీ ఘోరంగా ఉంది. ప్రస్తుతం ఏ నోట విన్నా.. పూణె మర్డర్ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. హనీమూన్ కేసులో పెళ్లయ్యాక భర్తను చంపేస్తే.. ఇక్కడ పెళ్లికాకముందే కాటికి పంపేసింది. ఇంకొక విషయం.. అక్కడ లోయలో తోసేసింది. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో జనాలు సోనమ్ ఉదంతాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందినవాడు. కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. కేతన్ అగర్వాల్-సియా గోయల్కు నిశ్చితార్థం జరిగింది. అయితే జూన్ 19న సియా పుట్టిన రోజు ఉండడంతో.. ముందు రోజు జూన్ 18న చారిత్రాత్మక ప్రాంతమైన లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లారు. అయితే కేతన్ లోయలో పడి చనిపోయినట్లుగా సియా పోలీసులకు ఫోన్ చెప్పింది. దీంతో అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కేతన్ అగర్వాల్కు ట్రెక్కింగ్లో మంచి పట్టుంది. అయితే ట్రెక్కింగ్ చేస్తూ చనిపోవడంపై బాధిత కుటుంబం నమ్మలేకపోయింది.
ఇక కేతన్ చనిపోయాక నంగనాచి సియా ఇన్స్టా్గ్రామ్లో ఎంత ప్రేమ ఒలకబోసిందంటే.. ‘‘నా పుట్టినరోజున నన్ను వదిలి వెళ్లిపోయావు. మనం పెళ్లికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు వెళ్లిపోయావు. నాకెందుకు ఇలా చేశావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాకు ఎన్నో కలలు ఉండేవి. ఎప్పటికీ సమాధానాలు దొరకని ప్రశ్నలు ఉండేవి. నేను నిన్ను అంతగా ప్రేమించినప్పుడు నన్ను ఎందుకు వదిలి వెళ్లిపోయావు? నీ ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అని రాసుకొచ్చింది.
అయితే అంత్యక్రియలు జరిగిన 4రోజుల తర్వాత కేతన్ ఇంటికి సియా వచ్చి పరామర్శించింది. ఈ సందర్భంగా కేతన్ సోదరి.. సియాను గుచ్చి గుచ్చి కొన్ని ప్రశ్నలు వేసింది. ఆమె సమాధానాలతో కొత్త అనుమానాలు రేకెత్తాయి. పైగా ట్రెక్కింగ్లో మంచి అనుభవం ఉన్నవాడు ఎలా చనిపోయాడంటూ సందేహం మెలిగింది. అంతేకాకుండా సియా ప్రవర్తనపై కేతన్ సోదరి దృష్టి పెట్టడంతో ఆమె అనుమానమే నిజమైంది. దీంతో పోలీసులకు ఉప్పు అందించింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సియా గోయల్ సమాధానాలు తికమక అయ్యాయి. దీంతో పోలీసులకు కూడా సందేహాలు మొదలయ్యాయి. దీంతో సెల్ఫోన్, సెల్ టవర్ లొకేషన్లు పరిశీలించగా అనుకున్నదే నిజమైంది. ప్రియుడు చేతన్ చౌదరితో జనవరి 1 నుంచి జూన్ వరకు 2, 004 సార్లు ఫోన్లు మాట్లాడినట్లుగా కనిపెట్టారు. అంతేకాకుండా 6 నెలల వ్యవధిలో 238 గంటలు మాట్లాడినట్లుగా గుర్తించారు. ఇక జూన్ 18న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5:40 వరకు చేతన్ చౌదరి ఇంటర్నెట్ కనెక్షన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని అధికారులు తేల్చారు. లొకేషన్ దొరకకుండా ఉండేందుకు ఫోన్ను షాపులో వదిలేసి.. ఒక ఉద్యోగి ఫోన్ తీసుకెళ్లినట్లుగా కనిపెట్టారు. ఇక చేతన్ ఫోన్కు కాల్స్ వచ్చినప్పుడు కార్మికులే మాట్లాడినట్లుగా గుర్తించారు.
అయితే తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 14నే కేతన్ను సియా లోహ్గఢ్ కోట పైనుంచి తోసేసిందని.. అయితే కేతన్ ఒక పొదను పట్టుకుని బయటపడ్డాడని.. అయితే రహస్యం బయటపడిపోతాదేమోనని.. కేతన్ను గట్టిగా కౌగిలించుకుని ‘‘పాము.. పాము’’ అంటూ డ్రామా ఆడిందని కేతన్ తండ్రి చెప్పారు. నిజమే అనుకుని సియాను కేతన్ అనుమానించలేదని బాధిత తండ్రి వెల్లడించాడు. అయితే ఈ అవకాశాన్ని సియా ఆసరాగా తీసుకుని సరిగ్గా నాలుగు రోజుల తర్వాత చంపేసిందని వాపోయాడు.
ఫిబ్రవరి 11న కేతన్-సియాల బంధం కుదిరింది. దీంతో ఫిబ్రవరి 19న లాంఛనంగా నిశ్చితార్థం జరిగింది. ఇక నవంబర్ 25న గ్రాండ్గా ఉధయ్పూర్ ప్యాలెస్లో పెళ్లి జరిపించాలని రూ.17 కోట్లు అడ్వాన్స్ కూడా చెల్లించారు. అతిథుల కోసం రెండు విమానాలు కూడా సిద్ధం చేశారు. ఇప్పటి నుంచే పెళ్లి సందడి మొదలైపోయింది. అయితే జూన్ 19న సియా గోయల్ బర్త్డే ఉంది. ఇందుకోసం కేతన్ భారీగా ఏర్పాట్లు చేశాడు. కానీ ఇంతలోనే జూన్ 18న కాబోయే భర్త రక్తాన్ని కళ్లరా చూసింది. కేతన్ను తీసుకెళ్లినప్పుడే.. ప్రియుడి చేతన్ కూడా కోటకు రప్పించింది. కేతన్ కొండపై ఉన్నప్పుడు ఇద్దరూ తోసేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.








