Telugu » Telangana » Police In Peddapalli District Seize Government Paddy Worth 158 Crore And Apprehend Millers

Police in Peddapalli district seize government paddy worth 158 crore and apprehend millers.

CMR Paddy Fraud: పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వానికి చెందిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం(CMR Paddy Fraud) పక్కదారి పట్టిన ఉదంతంలో ఇద్దరు రైస్ మిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పూసాల గ్రామంలోని సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లు యజమానులు బండారి మారుతి, సొక్కం అంజయ్యలు రూ.7 కోట్ల విలువైన ధాన్యాన్ని మాయం చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. దీనిపై అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వారు సాగించిన రూ.158 కోట్ల భారీ రైస్ మిల్లింగ్ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసు వివరాలను పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు.

గత 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లుకు 3,116 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం వీరు ప్రభుత్వానికి తిరిగి 2,119 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా, కేవలం 515 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చి మిగిలిన సుమారు రూ.7 కోట్ల విలువైన బియ్యాన్ని నొక్కేశారు. ఈ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేయగా, నిందితులకు చెందిన మిగతా మూడు రైస్ మిల్లుల్లోనూ గత కొన్ని ఏళ్లుగా వివిధ ఖరీఫ్, రబీ సీజన్లలో ఇలాగే భారీగా ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విచారణలో స్పష్టమైంది.

వీరి అక్రమ సామ్రాజ్యంలో ఇల్లంతకుంటలోని సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా అత్యధికంగా రూ.69 కోట్లు, జమ్మికుంట మండలం కోరపల్లిలోని మహాశక్తి ఇండస్ట్రీస్ నుండి రూ.62 కోట్లు, అలాగే సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని సాయి మహాలక్ష్మి రైస్ మిల్లు ద్వారా రూ.20 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని మాయం చేశారు. ఈ భారీ స్కాంలో ప్రధాన నిందితుడైన బండారి మారుతి సాధారణ వ్యాపారి కాదని, అతనిపై గతంలోనే ఒక హత్యానేరంతో పాటు మరో ఏడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ రాంరెడ్డి పేర్కొన్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన స్పష్టం చేశారు.