ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు హాజరయ్యారు. వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులు అందజేశారు.

అధికారిక వివరాల ప్రకారం.. ఈ విడతలో మొత్తం 65 పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో 2 పద్మ విభూషణ్, 7 పద్మ భూషణ్, 56 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ, ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, నటుడు ఆర్. మాధవన్, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ వంటి పలువురు ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులు 2026లో మొత్తం 131 మందిని ఎంపిక చేసింది. వీరిలో 5 మందికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా.. 16 మందికి మరణానంతరం ఈ గౌరవాన్ని ప్రకటించారు. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా గుర్తింపు పొందిన పద్మ అవార్డులు కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగం, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, సివిల్ సర్వీసులు వంటి అనేక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు.

ఇటీవల మే 26న నిర్వహించిన తొలి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 మందికి పద్మ పురస్కారాలు అందజేశారు. తాజాగా జరిగిన రెండో కార్యక్రమంలో ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్, నటుడు మమ్ముట్టి, ప్రకటనల రంగ నిపుణుడు పీయూష్ పాండే, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్, వైద్య నిపుణుడు డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, సామాజిక కార్యకర్త వెల్లప్పల్లి నటేశన్, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి తదితరులు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 1954లో ప్రారంభమైన పద్మ అవార్డులు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. దేశ అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అవార్డు గ్రహీతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

#WATCH | Delhi | JMM patriarch & tribal leader Shibu Soren awarded the Padma Bhushan posthumously in the field of Public Affairs by President Droupadi Murmu

The award was received by his wife, Rupi Soren. pic.twitter.com/JsL2xsX7fL

#WATCH | Delhi | Malayalam cinema legend Mammootty awarded the Padma Bhushan by President Droupadi Murmu

(Video source: Rashtrapati Bhavan) pic.twitter.com/XXCPOyG4pS

#WATCH | Delhi | Eminent playback singer Alka Yagnik conferred with Padma Bhushan by President Droupadi Murmu