పాపం కొందరు దొంగలు ఎంతో కష్టపడి, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తమ వృత్తిలో నిమగ్నమయ్యారు. ఓ నాలుగు షాపుల్లో చోరీకి ప్రయత్నించారు. ఎంతో కష్టపడి దుకాణాల్లోకి చొరబడితే వారికి దొరికింది చూసి తీవ్ర నిరాశతో ఉసూరుమంటూ ఉడాయించారు.
గుంటూరు జిల్లా తెనాలిలో బంగారం దుకాణాలే లక్ష్యంగా దొంగల ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. షాపుల యజమానులు తీసుకుంటున్న జాగ్రత్తలతో దొంగలు రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వస్తోంది. తాజాగా గంగానమ్మ పేటలో జరిగిన ఓ చోరీ యత్నంలో దొంగలకు కేవలం 50 గ్రాముల వెండి మాత్రమే దొరికింది.
గంగానమ్మ పేటలోని పాత శివాలయం వెనుక బజార్లోకి ముఖానికి మాస్క్లు ధరించిన ఇద్దరు దొంగలు అర్ధరాత్రి ప్రవేశించారు. సీసీ కెమెరాల దిశలను మారుస్తూ, వెంట తెచ్చుకున్న గునపాలతో వరుసగా మూడు జ్యూయలరీ షాపుల షట్టర్లు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. షట్టర్లు తెరుచుకోకపోవడంతో, చివరకు ‘విజయలక్ష్మీ జ్యూయలర్స్’లోకి చొరబడ్డారు.
అయితే దుకాణంలోని వెండి, బంగారు ఆభరణాలన్నీ లోపల సేఫ్ లాకర్లలో భద్రంగా ఉండటంతో వాటిని దొంగిలించడం వారి వల్ల కాలేదు. దీంతో అక్కడ దొరికిన 50 గ్రాముల చిన్న వెండి వస్తువును తీసుకుని ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఆ సమయంలో వర్షం పడుతుండటం, స్థానిక గూర్ఖా అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగలు బైక్పై అక్కడి నుండి పరారయ్యారు.
గతంలోనూ ఇదే బజార్లో దొంగతనాలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఆధునిక సాంకేతిక తాళాలు, లాకర్లు వాడటం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.








