Iran Oil: ఇరాన్‌పై విధించిన ఆంక్షల్ని అమెరికా 60 రోజలు పాటు సడలించింది. దీంతో ఇరాన్ తన వద్ద ఉన్న భారీ ఆయిల్ నిల్వల్ని అమ్ముకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ప్రస్తుతం భారత్ మార్కెట్ ఒక ఆశగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల రిఫైనరీలతో ఇరాన్ చర్చలు నడుపుతోంది. ప్రస్తుతం ఇరాన్ సముద్రంలో కోట్లాది బ్యారెళ్ల ఆయిల్ ఉంది. చమురును విక్రయించేందుకు ఇరాన్ వేగంగా పావులు కదుపుతోంది.

అమెరికా ఆంక్షల కారణంగా భారత్ చాలా కాలంగా క్రితమే ఇరాన్ ఆయిల్ కొనుగోలును నిలిపేసింది. అయితే, ఇప్పుడు రెండు నెలల సడలింపుతో ఇరాన్ భారత్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. భారత్ వంటి పెద్ద మార్కెట్ ఇరాన్‌కు ఇప్పుడు అవసరం. ప్రస్తుతం ఇరాన్ వద్ద 6.8 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ ముడిచమురు ట్యాంకర్లలో నిల్వ ఉంది. ఇందులో 80 శాతానికి పైగా చమురుకు స్పష్టమైన కొనుగోలుదారులు లేరు. భారత్ సమీపంలోనే ఇరాన్ ఉండటంతో కేవలం రెండు మూడు రోజుల్లోనే ఆయిల్ ట్యాంకర్లు భారత ఓడరేవుల్ని చేరే అవకాశం ఉంది.

అయితే, భారత రిఫైనరీలు ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు తొందరపడటం లేదు. ఆగస్టు వరకు అవసరమైన ముడి చమురు దిగుమతుల్ని వివిధ దేశాల నుంచి ఖరారు చేసుకుంది. ఇదే కాకుండా, అమెరికా ఆంక్షలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి ఉంది. గతంలో పలుమార్లు ఆంక్షల్ని విధించడం, ఎత్తేయడం చేసింది. ఇదే కాకుండా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో బీమా, నిధుల సమీకరణ, నౌకా రవాణా వంటి అంశాలు సవాళ్లలో కూడుకున్నాయి. అయితే, ఇరాన్ చమురు విషయంలో తొందరలో ఉండటంతో తక్కువ రేటు కోసం భారత్ బేరసారాలు చేసే అవకాశం లేకపోలేదు.

చమురు దిగుమతుల కన్నా ఇరాన్‌తో ఎల్పీజీ, ఎరువులు, పెట్రో కెమికల్స్ వంటి భారత్‌ సహకారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అమెరికా ఆంక్షల సడలింపు దీర్ఘకాలం కొనసాగితే మళ్లీ భారత్ ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.