కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అల్లుడు షాయాన్ మసూద్, ఆగస్టు 20న లక్నోలో సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇమ్రాన్ మసూద్ రాజకీయ విధానాలను షాయాన్ బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. బీజేపీని ఓడించాలంటే అఖిలేష్ యాదవ్తో కలిసి పనిచేయడం తప్పనిసరి అని, ఇమ్రాన్ మసూద్ సిద్ధాంతాలతో తాను ఏకీభవించనని షాయాన్ పేర్కొన్నారు.
ఈ పరిణామాల తర్వాత ఇమ్రాన్ మసూద్ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఎంపీ కుమార్తె సుబియా మసూద్పై ఆమె భర్త షాయాన్, మామ షాదాన్ మసూద్ దాడి చేశారని ఇమ్రాన్ మసూద్ సోదరుడి కుమారుడు హంజా నౌమాన్ మసూద్ ఆరోపించారు. గత ఐదేళ్లుగా కుటుంబ పరువు కోసం ఎన్నో విషయాలను మౌనంగా భరిస్తున్నామని, రాజకీయ కారణాలతో తన సోదరిని వేధించి ఆమె జీవితాన్ని నాశనం చేశారని హంజా ఫేస్బుక్ లైవ్లో పేర్కొన్నారు.
కుటుంబంలో జరిగిన సంఘటనలకు సంబంధించి తమ వద్ద అనేక వీడియోలు, రికార్డింగ్లు ఉన్నాయని హంజా తెలిపారు. ఈ వివాదం మరింత ముదిరితే ఆ ఆధారాలను ప్రజల ముందు పెడతానని ఆయన హెచ్చరించారు. సుబియా, ఆమె ఏడాది వయసు బిడ్డ బాధ్యతలను ఇకపై తమ కుటుంబమే చూసుకుంటుందని హంజా చెప్పారు. షాయాన్ తన బిడ్డ అవసరాలను నిర్లక్ష్యం చేశారని, కనీసం డైపర్లకు కూడా డబ్బులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను షాయాన్ మసూద్ ఖండించారు. రాజకీయ పోటీ ఉంటే దాన్ని రాజకీయ వేదికపైనే చూసుకోవాలని, కుటుంబ విషయాలను బయటపెట్టి వివాదాన్ని పెంచవద్దని ఆయన కోరారు. తన వద్ద చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయని, అయితే వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదని షాయాన్ చెప్పారు.
ఈ వివాదంపై చర్చ ఇంటి లోపల జరిగితే, ఎలాంటి ఆరోపణలకైనా సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని షాయాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య నెలకొన్న ఈ విభేదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.







