అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ క్రికెట్ రూపురేఖలనే మార్చేలా కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎడిన్బర్గ్లో ఇటీవల ముగిసిన వార్షిక సమావేశంలో న్యూజిలాండ్ మాజీ క్రీడాకారుడు రోజర్ ట్వోస్ నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్ ఈ విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించింది. ముఖ్యంగా 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచకప్లో పాల్గొనే జట్ల సంఖ్యను 12కు తగ్గించాలని ఐసీసీ యోచిస్తోంది.
గత రెండు టోర్నమెంట్లలో 10 జట్లు మాత్రమే ఉండగా, ఈసారి 14 జట్లకు అవకాశం ఇవ్వాలని మొదట భావించారు. అయితే తాజా ప్రణాళిక ప్రకారం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఆ తర్వాత సూపర్ 7 రౌండ్ నిర్వహించనున్నారు. రెండు గ్రూపుల్లో టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, నాలుగో స్థానంలో ఉన్న అత్యుత్తమ జట్టును కూడా సెలక్ట్ చేస్తారు.
టీ20 ప్రపంచకప్లో కూడా గణనీయమైన మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న సూపర్ 8 రౌండ్ స్థానంలో సూపర్ 10 దశను తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది. మొత్తం 20 జట్లను నాలుగు జట్ల చొప్పున ఐదు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లను తదుపరి రౌండ్కు పంపించాలని నిర్ణయించారు. దీంతో డెడ్-రబ్బర్ మ్యాచ్లు తగ్గి, గ్రూప్ దశ నుంచే ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల లీగ్ తర్వాత కేవలం ఒక ఫైనల్తో ముగించకుండా, ఇకపై సెమీఫైనల్స్ కూడా నిర్వహించాలని ప్రతిపాదించారు. అంతేకాదు, ఫుట్బాల్లోని ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ తరహాలో 'వరల్డ్ కప్ టీ20' పేరుతో కొత్త గ్లోబల్ క్లబ్ టోర్నమెంట్ ప్రారంభించాలని ఐసీసీ ప్లాన్ చేస్తోంది.
ఈ ప్రతిపాదనలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. వీటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే క్రికెట్ ప్రపంచంలో నూతన శకం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఐపీఎల్, ఎస్ఏ20 వంటి అగ్రశ్రేణి ఫ్రాంచైజీ జట్లు ఒకే వేదికపై తలపడే అవకాశం ఏర్పడుతుంది.








