Telugu » Andhrapradesh » Meghanas Father Ananth Krishna Goud Makes Sensational Comments About Jogi Ramesh

Jogi Ramesh Family Dispute : వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఫ్యామిలీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి రమేశ్ కోడలు మేఘన, ఆమె తండ్రి అనంత్ కృష్ణ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంత కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. తన కుమార్తె మేఘన వైవాహిక జీవితాన్ని నాశనం చేశారంటూ జోగి రమేష్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆయన ఇంటి ముందు కుటుంబ సభ్యులంతా కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.

మా కుటుంబానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. మాది వ్యాపార కుటుంబం. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తన కుమార్తె జీవితాన్ని జోగి రమేశ్ కుటుంబ సభ్యులు నాశనం చేశారని అనంత్ కృష్ణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జోగి రమేశ్ మాట్లాడే తీరు చాలా నీచంగా ఉంటుందని ఆయన ఆరోపించారు. తమను ఎదురుగా ఉన్నప్పుడు బావగారు అంటూ సంబోధిస్తారు. మేము వెళ్లిపోయిన తరువాత కొడకా అంటూ తిడతారని అన్నారు. కుటుంబంలో గొడవలు సద్దుమణిగేలా తాము ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ, జోగి రమేష్ కుటుంబం ఎప్పుడూ సామరస్యంగా మాట్లాడేందుకు ముందుకు రాలేదని కృష్ణ గౌడ్ పేర్కొన్నారు.

కొడుకు లోపాలు తెలిసి కూడా పెళ్లి ఎందుకు చేశారో చెప్పాలని జోగి రమేశ్ ఫ్యామిలీని అనంత్ కృష్ణగౌడ్ ప్రశ్నించారు. పెండ్లి జరిగిన రెండు నెలలకే డైవర్స్ పిటిషన్ వేశారంటే వారి బుద్ధిని అర్థం చేసుకోవచ్చునని అన్నారు. తమ కుమార్తె మేఘనకు జరిగిన అన్యాయంకు జోగి రమేశ్ బాధ్యత వహించాలి. ప్రస్తుతం మేఘనకు న్యాయం జరగడంతో పాటు ఆమె ప్రశాంతమైన జీవితం గడిపేలా చూడాలని కోరారు.

తమకు న్యాయం జరగకపోతే జోగి రమేష్ ఇంటి ముందు కుటుంబ సభ్యులందరితో కలిసి ధర్నా చేస్తామని అనంత్ కృష్ణ గౌడ్ తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ను కూడా కలిసి తమకు న్యాయం చేయాలని కోరతామని చెప్పారు.