హైదరాబాద్‌, ఆగస్ట్‌ 25: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈసారి అధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన మార్కుల సర్టిఫికెట్లు అందనున్నాయి. చిరిగిపోని, మందమైన కాగితంతో వీటిని ముద్రించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ తెలిపారు. ఈ సర్టిఫికెట్లు సులభంగా చిరిగిపోకుండా, తడిసినా పెద్దగా దెబ్బతినకుండా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అడ్డుకట్ట వేసేలా ఈసారి మార్కుల సర్టిఫికెట్లలో హై సెక్యూరిటీ ఫీచర్లను మరింత పెంచినట్లు ఇంటర్‌బోర్డు తెలిపింది. సర్టిఫికెట్లలో దాదాపు 10 రకాల హై సెక్యూరిటీ ఫీచర్లను ఉపయోగించగా.. మొత్తంగా 25 రకాల భద్రతా అంశాలను పొందుపరిచినట్లు అభిలాష అభినవ్‌ వెల్లడించారు.

విద్యార్థుల గుర్తింపును మరింత స్పష్టంగా నిర్ధారించేందుకు ఈసారి మార్కుల సర్టిఫికెట్లలో కలర్‌ ఫొటోలను జోడించారు. అలాగే బార్‌కోడ్‌తో పాటు పలు ఇతర భద్రతా అంశాలను కూడా చేర్చారు. దీంతో సర్టిఫికెట్లను సులభంగా నకిలీ చేయడం సాధ్యం కాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి, మే నెలల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్‌ సర్టిఫికెట్లను ఇప్పటికే ఆయా జిల్లాల డీఐఈఓలు, నోడల్‌ ఆఫీసర్లకు పంపించారు. అక్కడి నుంచి సంబంధిత కళాశాలలకు సర్టిఫికెట్లను పంపించనున్నారు.

విద్యార్థులు తమ మార్కుల సర్టిఫికెట్లను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి పొందవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ తెలిపారు. కొత్త సర్టిఫికెట్లలో అధునాతన భద్రతా ఫీచర్లు ఉండటంతో భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవసరాల కోసం వాటిని మరింత సురక్షితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.