భారత రైతాంగానికి శాపంగా మారుతున్న పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. విషతుల్యమైన ఈ రసాయనంపై నిషేధం విధిస్తూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఆదేశాలు జులై 14 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇప్పటికే 70కి పైగా దేశాల్లో ఈ గడ్డిమందును నిషేధించగా, మన దేశంలో మాత్రం ఇది యథేచ్చగా అమ్ముడుపోతోంది. పారాక్వాట్ వల్ల కలిగే దుష్పరిణామాలపై వైద్యులు, వ్యవసాయ పరిశోధకులు పదేపదే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం చివరకు కఠిన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ రసాయనం కారణంగా 6 వేల మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని రికార్డులు తెలియజేస్తున్నాయి.

కీటకనాశన చట్టం 1968లోని సెక్షన్ 27 ప్రకారం పారాక్వాట్ దిగుమతి, తయారీ, రవాణా మరియు పంపిణీపై పూర్తి స్థాయి నిషేధం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, సంబంధిత కంపెనీలు తమ అభ్యంతరాలు లేదా సూచనలు తెలియజేయడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. జూలై 13 నుంచి ఆగస్టు 13లోపు ఉత్పత్తి సంస్థలు తమ స్పందనను వెల్లడించాల్సి ఉంటుంది.

పారాక్వాట్‌కు నిర్దిష్ట విరుగుడు మందు లేకపోవడంతో వైద్యులు దీనిని అత్యంత ప్రాణాంతక రసాయనంగా పరిగణిస్తున్నారు. ఇది శరీరంలోకి వెళ్లగానే ఊపిరితిత్తులను దెబ్బతీసి, కోలుకోలేని ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాలు, కాలేయం, చర్మం మరియు కళ్లకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. చికిత్స కేవలం సహాయకారిగా మాత్రమే ఉంటుంది కాబట్టి, విషప్రయోగం జరిగితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటోంది.

గతంలో కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ గడ్డిమందు వాడకాన్ని పరిమితం చేసినా, చట్టపరమైన సవాళ్ల కారణంగా పూర్తి నిషేధం సాధ్యం కాలేదు. కానీ ప్రభుత్వ నిపుణుల బృందం మరియు రిజిస్ట్రేషన్ కమిటీ సిఫారసుల మేరకు ఇప్పుడు మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఏకరీతి నిషేధం అమలు కానుంది.