రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహారీపురాలో ఉన్న ఒక గిడ్డంగిపై ఆహార భద్రతా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో దాదాపు 10 క్వింటాళ్లు అంటే 1,000 కిలోల కల్తీ రసగుల్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మిఠాయిల తయారీలో కల్తీ పనీర్, చక్కెరతో పాటు 'సెఫోలైట్' అనే రసాయనాన్ని వాడుతున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంగణం నుంచి నాలుగు నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు.
నిబంధనల ప్రకారం సీజ్ చేసిన మిఠాయిలను అధికారులు పారవేస్తున్నారు. ఈ గిడ్డంగి నిర్వాహకుడి లైసెన్సును రద్దు చేసిన అధికారులు, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత ఆగస్టు 14న కూడా ఇదే ప్రాంతంలోని పలు డెయిరీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి 868 కిలోల పనీర్, 170 కిలోల కోవాను అధికారులు ధ్వంసం చేశారు.
దేశవ్యాప్తంగా ఆహార భద్రతను పర్యవేక్షించే భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కల్తీకి వ్యతిరేకంగా చర్యలు ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్లో కూడా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. చమోలీ, డెహ్రాడూన్, హరిద్వార్తో సహా పలు జిల్లాల్లోని ఆహార సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో నమూనాలను సేకరించారు.
పండుగ వేళ పాల ఉత్పత్తులకు, మిఠాయిలకు డిమాండ్ పెరగడంతో కల్తీని అరికట్టేందుకు అధికారులు నిఘాను పెంచారు. గడువు ముగిసిన లేదా పాడైపోయిన ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతో పాటు, లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుపుతున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నారు.







