బెంగళూరుకు చెందిన స్టార్టప్ E3 ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి అడుగుపెడుతూ ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ స్కూటర్‌లో AI ఆధారిత సాంకేతికతను పొందుపరిచారు. ఇది బ్యాటరీ, మోటార్ పనితీరుతో పాటు రహదారి పరిస్థితులను పర్యవేక్షించడంలో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

ఈ స్కూటర్ 2.3 kWh రిమూవబుల్ బ్యాటరీ మరియు 3 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. రైడింగ్ పరిస్థితులు, వేగం మరియు రోడ్డు స్థితిని బట్టి గరిష్ఠంగా 165 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10 కిలోమీటర్ల ప్రయాణానికి అవసరమైన ఛార్జింగ్ లభిస్తుంది.

ఆధునిక ఫీచర్లలో భాగంగా ఇందులో 5-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అదనపు స్క్రీన్ ఉంది. వీటితో పాటు క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మరియు ఫార్వర్డ్ పార్కింగ్ మోడ్స్, ఎకో, పవర్, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్ వంటి 100కు పైగా ఫీచర్లను అందించారు.

మూడు వేరియంట్లలో విడుదలైన ఈ స్కూటర్ బేస్ వేరియంట్ ధర రూ.1.00 లక్ష, మిడ్-స్పెక్ వేరియంట్ ధర రూ.1.10 లక్షలు, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. సెప్టెంబర్ నెలలో ఈ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.