అమెరికా ప్రభుత్వ అప్పులు ఏకంగా 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర కలకలం రేపుతోంది. భారీ ఆర్థిక లోటు కారణంగా ఏటా వడ్డీ చెల్లింపులకే 1.2 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయి. మరోవైపు AI డేటా సెంటర్ల నిర్మాణం కోసం కార్పొరేట్ కంపెనీలు భారీగా అప్పులు కావాలని కోరుతుండటంతో ట్రెజరీతో పోటీ పెరుగుతోంది. ఈ విపరీతమైన అప్పుల కుప్పను భరించేదెవరు? ఇన్వెస్టర్లు కోరుతున్న ప్రతిఫలం ఎంత? అనే ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లోని ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గత వారం లాంగ్-డేటెడ్ ట్రెజరీ బాండ్ల అమ్మకాలతో బాండ్ మార్కెట్ అట్టుడికిపోయింది. దీర్ఘకాలిక బాండ్ ఈల్డ్స్ అకస్మాత్తుగా పెరగటంతో వాషింగ్టన్ రంగంలోకి దిగింది. సెప్టెంబర్ 9 నుంచి లాంగ్-డేటెడ్ బాండ్ల బైబ్యాక్లను రెట్టింపు చేస్తామని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఈ జోక్యం తాత్కాలికంగా ఊరటనిచ్చినా.. ఇన్వెస్టర్లలో భయాలు పూర్తిగా తొలగిపోలేదు. మార్కెట్లో బాండ్ల అమ్మకాలతో సరఫరా విపరీతంగా పెరగడం వల్ల ఈల్డ్స్ పెరుగుతూ ప్రభుత్వానికి వడ్డీ భారాన్ని మరింత పెంచుతున్నాయి.
అమెరికా ట్రెజరీ తీసుకుంటున్న ఈ బైబ్యాక్ చర్యలు జపాన్ గతంలో అనుసరించిన 'ఈల్డ్-కర్వ్ కంట్రోల్' విధానాన్ని పోలి ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం డాలర్ విలువను తీవ్రంగా బలహీనపరుస్తోంది. ఒకవేళ వాషింగ్టన్ కృత్రిమంగా లాంగ్ టర్మ్ ఈల్డ్స్ను కట్టడి చేయాలని చూస్తే.. ద్రవ్యోల్బణ నష్టాలకు తగిన ప్రతిఫలం దక్కదని భావించే విదేశీ ఇన్వెస్టర్లు డాలర్ ఆస్తుల నుంచి వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. ఇది డాలర్ను మూతపడేలా చేసే సరికొత్త ప్రతికూల పరిస్థితులకు దారితీస్తోంది.
పరుగెత్తుతున్న బంగారం, క్రిప్టోలు.. సాధారణంగా బాండ్ ఈల్డ్స్ తగ్గినప్పుడు బంగారం రాణిస్తుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ బలహీనపడుతుండటం, అమెరికా ఆర్థిక విధానాలపై నమ్మకం సడలుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత ప్రత్యామ్నాయాలైన గోల్డ్, సిల్వర్, క్రిప్టోకరెన్సీల వైపు పరుగులు తీస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా క్రిప్టోలు, విలువైన లోహాలు బలమైన స్టోర్ ఆఫ్ వాల్యూగా మారుతున్నాయి.
భారతీయ మార్కెట్లు, ఈక్విటీలపై ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ కదలికలు, విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ భారతీయ మార్కెట్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. యూఎస్ ఈల్డ్స్ ఎగబాకితే భారత్ కూడా ఆకర్షణీయమైన ప్రీమియం ఇవ్వాల్సి వస్తుంది. ఇది మన దేశ ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్స్పై ఒత్తిడి తెచ్చి ఈక్విటీ వాల్యుయేషన్లను తగ్గిస్తుంది. ఒకవేళ ట్రెజరీ జోక్యం విజయవంతమై యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ గనుక బలహీనపడితే.. భారతీయ కంపెనీలకు తక్కువ వడ్డీకి రుణాలు లభించే అవకాశం దొరుకుతుంది.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏ అంశాలను నిశితంగా గమనించాలి? ప్రస్తుత సంక్షోభంలో ఇన్వెస్టర్లు కేవలం ఫెడ్ రేట్ కోతల గురించే కాకుండా.. అమెరికా అప్పులను ఎవరు భరిస్తారు అనే దానిపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా 30-సంవత్సరాల, 10-సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ కదలికలు, విదేశీ ట్రెజరీ డిమాండ్, బంగారం ధరల సరళిని పరిశీలించాలి. స్కాట్ బెసెంట్ బాండ్ బైబ్యాక్ కార్యక్రమం కేవలం సమస్యను పైపూత పూసి దాచడమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు.








