ఎస్టోనియా తరఫున ఆడుతున్న సాహిల్ చౌహాన్, సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లోనే అజేయంగా 144 పరుగులు చేశాడు. ఇందులో 18 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా సాహిల్ నిలిచాడు.

భారత క్రికెటర్ అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌పై 30 బంతుల్లో సెంచరీ సాధించి, భారత్ తరఫున అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు. అయితే, ప్రపంచ రికార్డు సాహిల్ పేరు మీద ఉండటంతో, అతడి నేపథ్యం గురించి తెలుసుకోవాలని చాలా మంది క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

సాహిల్ చౌహాన్ అసలు స్వస్థలం హరియాణా రాష్ట్రంలోని పింజోర్. మెరుగైన ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం యూరప్‌కు వలస వెళ్లిన సాహిల్, ఎస్టోనియాలో స్థిరపడ్డాడు. అక్కడ ఒక రెస్టారెంట్ చైన్ మేనేజర్‌గా పనిచేస్తూనే, క్రికెట్ మీద ఉన్న మక్కువతో స్థానిక క్లబ్ మ్యాచ్‌లు ఆడటం మొదలుపెట్టాడు.

తన బ్యాటింగ్ ప్రతిభతో ఎస్టోనియా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సాహిల్, ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అంతేకాదు, స్థానిక టీ10 లీగ్‌లలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది కూడా అతను వార్తల్లో నిలిచాడు. భారతీయ మూలాలు ఉన్న సాహిల్ చౌహాన్, ప్రపంచ క్రికెట్ రికార్డుల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు.