అఫ్గానిస్తాన్తో జరిగిన సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపులో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఐర్లాండ్ పర్యటనకు ముందు పెద్ద దెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా రాబోయే టీ20 సిరీస్కు అందుబాటులో ఉండరని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నారు.
ఐపీఎల్-2026 సీజన్లో ఎడమ కాలికి గాయపడిన వరుణ్ చక్రవర్తి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని వైద్యులు తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఐర్లాండ్ సిరీస్కే కాకుండా, తర్వాత ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్కు కూడా ఆయన దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరుణ్ చక్రవర్తి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై భారత క్రికెట్ బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో రాణించిన హర్ష్ దూబే లేదా కుల్దీప్ యాదవ్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తిరిగి చోటు దక్కించుకోగా, యశస్వి జైశ్వాల్, సిరాజ్కు చోటు దక్కలేదు.
ఐర్లాండ్ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్-కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఉండగా, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.








