హనుమకొండ చౌరస్తా : టీజీ20 లీగ్‌ ( TG-20 League ) ను చూస్తే తెలంగాణ ప్రతిభ ( Telangana Districts) కు వేదికగా కాకుండా, కొందరి కోసం నిర్వహిస్తున్న ఒక ‘ఎలైట్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ టోర్నమెంట్‌’లా కనిపిస్తుందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా కార్యదర్శి ( జైపాల్‌ Secretary Jaipal ) మండిపడ్డారు. మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ లీగ్‌ లో తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు నిండినా తెలంగాణ క్రికెట్‌ మాత్రం ఇంకా కొందరి పాలనలోనే ఉందని పేర్కొన్నారు. టీజీ20 పేరుతో నిర్వహిస్తున్న లీగ్‌లో తెలంగాణ జిల్లాల ప్రతిభకు నిజంగా స్థానం ఉందా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కొందరి ప్రభావం, పరిచయాలు, ఆర్థికశక్తి, క్రికెట్‌ ఫ్యూడలిజానికి మరో వేదికగా మారిందన్నారు.

జిల్లాల్లో నివసిస్తున్న వేలాది మంది యువక్రికెటర్లు కష్టపడి ఆడుతున్నా, ఎంపికల విషయంలో వారికి సమాన అవకాశాలు లభించాయా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. బీసీసీఐ లిఖితపూర్వక అనుమతి ఎక్కడ ఉంది.? హెచ్‌సీఏ జనరల్‌ బాడీ ఆమోద తీర్మానం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ఎంపికల ప్రమాణాలు, ట్రయల్స్​‍ వివరాలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం వివరాలు ఎందుకు బహిరంగంగా లేవని నిలదీశారు.

తెలంగాణ పేరును ఉపయోగించడం సులభం కానీ తెలంగాణ జిల్లా క్రికెటర్లకు న్యాయం చేయడం అంత సులభం కాదేమో అనిపిస్తోందన్నారు. క్రికెట్‌ ఎవరి జాగీరు కాదు, క్రికెట్‌ ఎవరి రాజకీయ వారసత్వం కాదు, క్రికెట్‌ ఎవరి కుటుంబ ఆస్తి కాదు, క్రికెట్‌ ఆటగాళ్లది. తెలంగాణ క్రికెట్‌ తెలంగాణ ప్రజలదన్నారు. ఎన్ని హాళ్లు మూసివేసినా, ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని ప్రశ్నల నుంచి తప్పించుకున్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. జిల్లాల ప్రతిభకు న్యాయం జరిగే వరకు, ఎంపికల్లో పారదర్శకత వచ్చే వరకు, తెలంగాణ క్రికెట్‌ నిజంగా తెలంగాణదయ్యే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.