ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై ఓ యువతి పెళ్లి పేరుతో మోసం​ చేశాడని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్‌ స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా, మగ్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం.

మీడియా కథనాల ప్రకారం.. అభిషేక్‌ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, ఆతర్వాత ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.

అయితే, ఈ ఆరోపణలను అభిషేక్‌ పూర్తిగా ఖండించాడు. ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు అసత్యమని, తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు.

కాగా, ప్రస్తుతం కేసు కేవలం ఫిర్యాదు దశలోనే ఉంది. పోలీసులు విచారణ చేపట్టి, ఇరు పక్షాల వాంగ్మూలాలు నమోదు చేసిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌నగర్‌లో జన్మించిన పోరెల్‌, బెంగాల్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. అలాగే ఇండియా-ఏ, వయోపరిమితి జట్లకూ ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతూ మంచి గుర్తింపు పొందాడు. దూకుడైన బ్యాటింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. పొట్టి క్రికెట్‌లో 1500కుపైగా పరుగులు చేసి, 150కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడి 4 అర్ద శతకాల సాయంతో 769 పరుగులు చేశాడు.

ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!