బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. భువనేశ్వర్, కోల్ కత్తా, బంగ్లాదేశ్ సముద్ర జలాల దగ్గర ఏర్పడగా.. ఈ నెల 24వ తేదీన ఇది కోల్‌కత్తా దగ్గర తీరం దాటేలా కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలకు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేదని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. భూపరితలంపై ఇది విస్తరించి ఉండగా.. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఏర్పడే అవకాశముందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆగస్ట్ 22 నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది.

అయితే వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆగస్ట్ 22న ఏపీ, తెలంగాణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేఘాలు కమ్ముకుని ఉంటాయి. రాత్రి తర్వాత ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో వానలు పడే ఛాన్స్ ఉంది. రెండు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. అరేబియా సముద్రంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో సముద్రంలో వేటకు మత్స్యకారులు వెళ్లవద్దని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో చేపలవేటకు వెళ్లవద్దని అలర్ట్ జారీ చేసింది. కాగా ఎల్‌నివో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు పడటం లేదు. మహబూబాబాద్ జిల్లాలో 32 శాతం లోటు వర్షపాతం నమోదవ్వగా.. జనగామలో 44 శాతం, వరంగల్‌లో 44 శాతం, హన్మకొండలో 47 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ చెబుతోంది.

అటు ఏపీలో కూడా లోటు వర్షపాతం నమోదవుతోంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలు జిల్లాల్లో లోటు మరింత ఎక్కువగా ఉంది. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది రైతులు పంట సాగుకు దూరమయ్యారు. అయితే రాబోయే రోజుల్లో కూడా పెద్దగా వర్షాలు పడే అవకాశం కనిపించడం లేదు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తప్ప పెద్దగా పడే చాన్స్ లేదని అంటున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాల అంచనా మారుతూ ఉంటాయి. వీటిని వాతావరణశాఖ ఎప్పటికప్పడుు వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా విడుదల చేసిన వెదర్ బులిటెన్‌లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్షసూచన జారీ చేసిేంది.