Telugu » National » Not Taking Political Sanyas Will Not Stop Till I Force Bjp Into Obscurity Mamata Banerjee
Mamata Banerjee : తాను రాజకీయ సన్యాసం తీసుకునే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని కనుమరుగు చేసేంతవరకు తాను విశ్రమించబోనని ఆమె చెప్పారు. ప్రభుత్వం మారిన నాలుగు నెలల్లోనే రాష్ట్ర ప్రజలు బీజేపీ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకున్నారని మమతా ఫేస్బుక్ లైవ్లో అన్నారు.
ఈ సందర్భంగా ఆమె జనాభా లెక్కల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు. జాతీయ పౌర పట్టిక (NRC)ని అమలుకు ఇది మరో రహస్య ప్రయత్నమని ఆరోపించారు. రాజకీయ పార్టీలను సంప్రదించకుండా అమలు చేశారన్నారు. జనాభా లెక్కల ఫారాలపై సంతకాలు చేసే ముందు, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే ముందు ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.
అలా చేయడం వల్ల వారి వ్యక్తిగత ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. మహిళల కోసం అందించే ‘అన్నపూర్ణ భండార్’ ఆర్థిక సహాయ పథకం కింద నిధులు అందడంలో జాప్యం జరుగుతోందంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు నిరసనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అనర్హతను కారణంగా చూపి బీజేపీ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తోందని ఆమె ఆరోపించారు. ఎస్ఐఆర్ ద్వారా లక్షలాది మంది అర్హులైన ఓటర్లను తొలగించారని మండిపడ్డారు. తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకు అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని మమతా స్పష్టం చేశారు.
మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ‘లక్ష్మీ భండార్’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. కానీ, బీజేపీ ‘అన్నపూర్ణ భండార్’కు డబ్బు ఇచ్చేందుకు మతం, కులాన్ని ప్రాతిపదికగా వాడుకుంటోందని దుయ్యబట్టారు.
ఎన్నికలకు ముందు మహిళలందరికీ ‘అన్నపూర్ణ యోజన’ డబ్బు ఇస్తామన్న వాగ్దానాన్ని ఉల్లంఘించి ఇప్పుడు వారిని మోసం చేస్తోందని మమతా విమర్శలు గుప్పించారు. జాదవ్పూర్ యూనివర్శిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్లో విధ్వంసానికి బీజేపీనే కారణమని ఆరోపించారు.








