హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీసులు భూఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టి, బెదిరింపుల ద్వారా ఆస్తి యజమానులను వేధిస్తున్న నేరస్థుడు మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్‌ను అరెస్టు చేశారు.

ఈ నేరస్థుడు దాదాపు పది సంవత్సరాలుగా భూములపై వివాదాలు సృష్టించి, కోర్టుల్లో నకిలీ కేసులు వేసి యజమానులను మానసిక ఒత్తిడికి గురిచేశాడని పోలీసులు తెలిపారు. రూ.10 లక్షలు డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు క్రిమినల్ కేసులు వేస్తామని బెదిరించినట్లు వివరాలు బయటపడ్డాయి.

జూన్ 22న బెంగళూరులోని తన కుమారుడి ఇంట్లో దాక్కున్న ఖుద్దూస్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణలో అనేక మంది యజమానుల నుంచి రూ.40 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.